వారం వారం తెవికీ వ్యాసాలు.

Sunday, September 28, 2008

టైటానిక్ నౌక: ఈ వారం తెవికీ వ్యాసం

టైటానిక్ నౌక, "వైట్ స్టార్ లైన్" అనే సంస్థ కోసం "హర్లాండ్ అండ్ వోల్ఫ్" అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో ఒకటి. 1912 లో దానిని మొదటిసారిగా ప్రవేశ పెట్టినపుడు ప్రపంచంలో కెల్లా అదే అతి పెద్ద ప్రయాణ నౌక. దాని మొదటి ప్రయాణంలోనే ఏప్రిల్ 15, 1912 వ తేదీన ప్రమాదవశాత్తూ ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. 1517 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. దీనివలన ఇది అపకీర్తిని మూటగట్టుకోవడమే కాకుండా చరిత్రలో అతి దురదృష్టకరమైన సంఘటనలలో ఒకటిగా మిగిలిపోయింది.


దీని నిర్మాణంలో అప్పట్లో ఉండే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన అది మునిగి పోవడం అసాధ్యం అని జనాలు నమ్మేవారు. కానీ అది మునిగిపోయి అపార ప్రాణనష్టాన్ని కలిగించడం చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. టైటానిక్ బాధితుల గురించి మాధ్యమాల ప్రచారం, నౌకలో జరిగినట్లుగా చెబుతున్న ప్రధాన సంఘటనలు, ఆతరువాత కొత్తగా ప్రవేశపెట్టబడిన నౌకాయాన న్యాయ నియమాలు, 1985లో రాబర్ట్ బల్లార్డ్ నేతృత్వం లో కనుగొనబడిన టైటానిక్ అవశేషాలు, ఈ నౌకకు అత్యంత ప్రాముఖ్యతను సంపాదించి పెట్టాయి.

టైటానిక్ నౌక మొట్టమొదట మరియు చిట్టచివరి ప్రయాణం ఇంగ్లాండులోని సౌథాంప్టన్ నుంచి న్యూయార్క్ నగరం వరకూ సాగవలసినది. ఎడ్వర్డ్.జె.స్మిత్ నావికుడిగా ఈ ప్రయాణం, 1912, ఏప్రిల్ 10 బుధవారం ఆరంభమైంది. ఏప్రిల్ 14 ఆదివారం రాత్రి. చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత. ఆరోజు దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తూ నౌకను నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదు. రాత్రి సమయంలో టైటానిక్ నౌక పర్వతాన్ని గుద్దుకోవడంలో నౌక కుడి వైపు 300 అడుగుల పొడవు మేరకు రాపిడికి గురై రివెట్లను బయటపడేసింది. సముద్రపు నీరు ముందు భాగపు గదులను నింపేస్తుండటంతో వాటి తలుపు వాటంతట అవే మూసుకుపోయాయి. ఐదు కంపార్ట్ మెంట్లూ నీటితో నిండిపోవడం ప్రారంభించాయి. అప్పటి నియమాల ప్రకారం ఈ నౌకలో సరిపడా లైఫ్ బోట్లు ఉన్నా నౌకలోని ప్రయాణీకులందరికీ అవి సరిపడలేదు.

... పూర్తి వ్యాసం

Sunday, September 21, 2008

స్వామీ వివేకానంద: ఈ వారం తెవికీ వ్యాసం

స్వామీ వివేకానంద, (జనవరి 12, 1863 - జూలై 4, 1902), ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాధుడు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.


భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండుల లో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి కలదు. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగో లో జరిగిన ప్రపంచ మత సమ్మేళనం(పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్)లో 1893లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిదేళ్ళ వయసు లోనే మరణించాడు.


వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని బోధనల ప్రకారం అద్వైత వేదంతము తత్త్వ శాస్త్రములో నే కాకుండా , సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. "దరిద్ర నారాయణ సేవ" అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతి లో కలిసి పోతాయని తెలుసుకున్నాడు. అతని సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది.

--- పూర్తి వ్యాసం

Sunday, September 14, 2008

పొట్టి శ్రీరాములు: ఈ వారం తెవికీ వ్యాసం

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.


పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌను, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పటమటపల్లె గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. 1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోవడం జరిగింది. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు.


మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. దేహం బలహీనం అయ్యి, స్పృహ తప్పి పోయినా దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకొన్నారు. స్పృహ లేనప్పుడు ఎవరూ బలవంతంగా ఇంజెక్షను ద్వారా ఆహారం ఎక్కించరాదని ఆయన చెప్పారు. అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అల్లరును వ్యతిరేకించాడు.

... పూర్తి వ్యాసం

Sunday, September 7, 2008

భారత క్రికెట్ జట్టు: ఈ వారం తెవికీ వ్యాసం

భారతదేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించే జట్టుకు భారత క్రికెట్ జట్టు అని వ్యవహరిస్తారు. ఇది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అజమాయిషీలో ఉంటుంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రపంచంలోనే స్పాన్సర్‌షిప్ రూపంలో అత్యధిక డబ్బును ఇచ్చే జాతీయ క్రీడాజట్టుగా నిలిచింది. భారతదేశం మొట్టమొదటి సారిగా 1921లో తొలి క్రికెట్ మ్యాచ్ ఆడింది. కాని అధికారికంగా మొదటి టెస్ట్ మ్యాచ్ 1932, జూన్ 25న ఇంగ్లాండుతో లార్డ్స్ లో ఆడి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆరవ దేశంగా స్థానం సంపాదించినది. 1900లలో కొందరు భారతీయులు ఇంగ్లీష్ క్రికెట్ టీంలో ఆడటానికి ఇంగ్లాండు వెళ్ళినారు. వారిలో ముఖ్యులు రంజిత్ సింహ్ జీ మరియు దులీప్ సింహ్ జీ. 1926లో ఇంపీరియల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)లో భారతదేశానికి ఆహ్వానించారు. 1932లో తొలిసారిగా అధికారిక టెస్ట్ మ్యాచ్ సి.కె.నాయుడు నేతృత్వంలో ఇంగ్లాండుతో ఆడింది.


టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు తొలి విజయం 1952లో ఇంగ్లాండుపై చెన్నైలో లభించింది. ఆ తరువాతి సంవత్సరం పాకిస్తాన్ పై తొలి సీరీస్ విజయం సాధించింది. 1950 దశాబ్దిలో భారత జట్టు మంచి పురోగతి సాధించింది. 1970 దశకంలో భారత జట్టులో స్పిన్ దిగ్గజాలైన బిషన్ సింగ్ బేడీ, ఎర్రపల్లి ప్రసన్న, చంద్రశేఖర్, వెంకట రాఘవన్ లాంటివారు ప్రవేశించారు. అదే సమయంలో ఇద్దరు ప్రముఖ బ్యాట్స్‌మెన్లు (సునీల్ గవాస్కర్ మరియు గుండప్ప విశ్వనాథ్ లు) కూడా భారత జట్టులో రంగప్రవేశం చేశారు. 1971లో అజిత్ వాడేకర్ నాయకత్వంలో భారతజట్టు ఇంగ్లాండు మరియు వెస్ట్‌ఇండీస్ లపై సీరీస్ విజయం సాధించగలిగింది.


1971లో వన్‌డే క్రికెట్ ప్రారంభమైన తరువాత క్రికెట్‌కు జనాదరణ బాగా పెరిగింది. 1970 దశాబ్దం ద్వితీయార్థం నుంచి టెస్టులలో భారత్ బలంగా తయారైంది. 1976లో క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్ట్‌ఇండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 403 పరుగుల లక్ష్యాన్ని ఛేదింది భారత్ రికార్డు సాధించింది.

... పూర్తి వ్యాసం

Monday, September 1, 2008

స్టీవ్ జాబ్స్: ఈ వారం తెవికీ వ్యాసం

స్టీవ్ జాబ్స్ గా పిలువబడే స్టీవెన్ పాల్ జాబ్స్ యాపిల్ ఇన్‌కార్పొరేటేడ్‌కు చైర్మెన్ మరియు CEO. కంప్యూటర్ రంగంలో మరియు వినోదం పరిశ్రమలో తిరుగులేని విజయాలను సాధించి ప్రపంచంలోనే ఒకానొక గొప్ప వ్యాపారవేత్తగా పేరుపొందాడు. ఇతను 1944 ఫిబ్రవరి 24న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు. జాబ్స్ కు చిన్నప్పటినుండి అధ్యాత్మిక విషయాల పైన చాలా ఆసక్తి. ఒక వీడియో గేమ్స్ కంపెనీలో కొన్నాళ్ళు పనిచేసి తగినంత డబ్బు చేకూరిన తర్వాత భారతదేశ పర్యటన చేసి వేదాంత, ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొన్నాడు. తర్వాత నున్నని గుండుతో, భారతీయ సాంప్రదాయ దుస్తులతో అమెరికాకు వెనుతిరిగాడు.


1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు. మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు. అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది. 1984లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది. 1984 చివరలో ఏర్పడిన మాంద్యం వల్ల 1985లో జాబ్స్ ను మ్యాకింటోష్ విభాగ అధిపతి పదవినుండి తొలగించారు. అప్పుడు NeXT అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్లు ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నా, చాలా ఖరీదయినవి కావడంతో ఎక్కువమంది కొనలేదు.


ఆపిల్ డైరక్టర్లు NeXTను 429 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసారు. అప్పటి ఒప్పందంలో భాగంగా స్టీవ్ జాబ్స్ మళ్ళీ ఆపిల్ కంపెనీకి తాత్కాలిక CEOగా నియమితుడయ్యాడు. కంపెనీని లాభాల బాటలో తీసుకెళ్ళడంలో ముఖ్యపాత్ర వహించడంతో 2000లో పూర్తిస్థాయి CEO అయ్యాడు. కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్‌ను ఆవిష్కరించి ఆపిల్‌ను ఎవరూ అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళగలిగాడు.


1986లో 10 మిలియన్ డాలర్లకు పిక్సర్ అనే గ్రాఫిక్స్ కంపెనీని కొన్నాడు. పిక్సర్-డిస్నీ సహయత్నంగా మొట్టమొదటి సినిమా అయిన టాయ్ స్టోరీ 1995లో విడుదలయి ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత పదేళ్ళపాటు వరుసగా ప్రతి సినిమా ఘన విజయాన్ని సాధిస్తూ గొప్ప లాభాలను ఆర్జించాయి. ఈ సంస్థ నిర్మించిన కొన్ని సినిమాలు: ఎ బగ్స్ లైఫ్, టాయ్ స్టోరీ 2, మాన్‌స్టర్స్.ఇన్‌క్, ఫైండింగ్ నీమో, ది ఇన్‌క్రెడిబుల్స్, కార్స్, రాటటూయి.

... పూర్తి వ్యాసం