వారం వారం తెవికీ వ్యాసాలు.

Sunday, October 25, 2009

జమ్మూ & కాశ్మీరు: ఈ వారం తెవికీ వ్యాసం

జమ్మూ & కాశ్మీరు రాష్ట్రం భారతదేశంలో ఉత్తరపుకొనన, హిమాలయ పర్వతసానువుల్లో ఒదిగిఉన్న రాష్ట్రం. జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో మూడు విభాగాలున్నాయి - జమ్ము ప్రాంతం ప్రధానంగా హిందువులు ఉన్న ప్రాంతం. జమ్ము నగరం మందిరాల నగరంగా ప్రసిద్ధం; కాశ్మీరు లోయ కనులకింపైన పర్వతశ్రేణులతోనూ, సెలయేర్లతోనూ, సరస్సులతోనూ భూతల స్వర్గంగా పేరు పొందింది. ఇక్కడి శ్రీనగర్ ముఖ్య నగరం, వేసవికాలపు రాజధాని. కాశ్మీరులో ముస్లిం మతస్తులు అధిక శాతంలో ఉన్నారు; లడఖ్ హిమాలయశిఖరాల మధ్య ఉన్న పీఠభూమి . బౌద్ధ మతస్తులు ఎక్కువగా ఉన్నందున దీనిని "చిన్న టిబెట్" అంటారు.లే" ఇక్కడి ప్రధాన పట్టణం. - కాని జమ్ము-కాశ్మీరు మూడు ప్రాంతాలలోనూ హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ మతస్తులు విస్తరించి ఉన్నారు.

భారత్, పాకిస్తాన్, చైనా దేశాలమధ్య కాశ్మీరువివాదం చాలా తీవ్రమైనది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మూడు యుద్ధాలకు (1947, 1965, 1999(కార్గిల్)కాశ్మీరు వివాదమే కారణం. జమ్ము-కాశ్మీరు సంపూర్ణ రాష్ట్రం భారతదేశపు అంతర్గత భూభాగమని భారతదేశం వాదన. కాని మొత్తం రాష్ట్రంలో సగభాగం మాత్రమే ఇప్పుడు భారతదేశం ఆధీనంలో ఉన్నది. కాశ్మీరు లోయలో కొంత భాగం పాకిస్తాన్ అధీనంలో ఉన్నది. ఆక్సాయ్‌చిన్ ప్రాంతం చైనా అధీనంలో ఉన్నది. భారతదేశం అధీనంలో ఉన్న కాశ్మీరు భాగాన్ని "భారతదేశం ఆక్రమించిన కాశ్మీరు" అనీ, పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాశ్మీరు భాగాన్ని "స్వతంత్ర కాశ్మీరు" అనీ పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. ఇక పాకిస్తాన్ అధీనంలోని కాశ్మీరు భాగాన్ని "పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీరు" అని భారతదేశం వ్యవహరిస్తుంది.

... పూర్తి వ్యాసం

Monday, October 19, 2009

తిరుపతి వేంకట కవులు: ఈ వారం తెవికీ వ్యాసం

దివాకర్ల తిరుపతి శాస్త్రి (1872-1919) మరియు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు. వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంధాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి. బావా ఎప్పుడు వచ్చితీవు.., చెల్లియో చెల్లకో.., జెండాపై కపిరాజు.. వంటి పద్యాల ఆరంభ పదాలు తెలియని తెలుగువారు అరుదు.


దివాకర్ల తిరుపతి శాస్త్రి పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం వద్ద యండగండి గ్రామంలో జన్మించాడు. చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామంలో జన్మించాడు. వేంకట శాస్త్రి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వద్ద విద్యాభ్యాసం చేస్తున్నపుడు తిరుపతి శాస్త్రితో పరిచయం ఏర్పడింది. మొదటినుండీ తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేది. ఇక వేంకట శాస్త్రి పురాణ సాహిత్యాలపై ఉపన్యాసాలివ్వడంలోనూ, మెరుపులా పద్యాలల్లడంలోనూ దిట్ట. ఒకసారి వినాయక చవితి ఉత్సవాలకు చందాలు వసూలు చేయడంలో ఇద్దరూ తమ తమ ప్రతిభలను సమన్వయంగా ప్రదర్శించారు. ఒకరి ప్రతిభపై మరొకరికి ఉన్న గౌరవం వారి స్నేహాన్ని బలపరచింది. వేంకట శాస్త్రి వారాణసి వెళ్ళి తిరిగి వచ్చినాక కాకినాడ లో జంటగా శతావధానం ప్రదర్శించారు. ఆ తరువాత జీవితాంతం ఆ సాహితీ మూర్తులు ఒకరికొకరు తోడున్నారు. తిరుపతి శాస్త్రి సదా వేంకటశాస్త్రిని తన గురువుగా భావించాడు. తిరుపతి శాస్త్రి మరణానంతరం కూడా వేంకట శాస్త్రి తన రచనలను జంట రచనలుగానే ప్రచురించాడు. ఇద్దరూ కలిసి అసంఖ్యాకంగా అవధానాలు నిర్వహించారు. సన్మానాలు అందుకొన్నారు. 'ధాతు రత్నాకరం' రచించారు. అడయారు వెళ్ళినపుడు అనీబిసెంట్ ప్రశంసలు అందుకొన్నారు. వెంకటగిరి, గద్వాల, ఆత్మకూరు, విజయనగరం, పిఠాపురం సంస్థానాలు సందర్శించి తమ ప్రతిభను ప్రదర్శించి సత్కారాలు గ్రహించారు.

... పూర్తి వ్యాసం

Sunday, October 11, 2009

ఈనాడు: ఈ వారం తెవికీ వ్యాసం

ఈనాడు ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. తెలుగు పత్రికలలోనే కాక యావద్దేశంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన పత్రికలలో ఒకటిగా నిలిచింది. ప్రజల జీవితాలతో మమేకమై, సమకాలీన చరిత్రలో విడదీయరాని భాగమైపోయింది. ఈనాడు తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దిన పత్రిక. NRS 2006 సర్వే ప్రకారం 1,38,05,000 మంది పాఠకులను కలిగి, దేశంలోనే తృతీయ స్థానంలో నిలచినది.

1974 ఆగష్టు 10న రామోజీరావు విశాఖపట్నం శివార్లలోని, సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడును ప్రారంభించాడు. అదే సంవత్సరం ఆగష్టు 28 తేదీన ఈ పత్రిక రిజిస్టర్ చేయబడినది. 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది. ప్రారంభంలోనే ఈనాడుకు కొన్ని ప్రత్యేకతలుండేవి. అప్పట్లో ఉన్న అన్ని పత్రికల పేర్లు ఎక్కువగా ఆంధ్ర శబ్దంతో మొదలయేవి. పైగా ఆ పేర్లు కాస్త సంస్కృత భాష ప్రభావంతో ఉండేవి. ఈనాడు అనే అసలు సిసలైన తెలుగు పేరుతో మొదలైన ఈ పత్రిక అప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేని కొత్త అనుభవాలను అందించింది. ఆ రోజుల్లో పత్రికలు ప్రచురితమయ్యే పట్టణాలు, ఆ చుట్టుపక్కలా తప్పించి మిగిలిన రాష్ట్రం మొత్తమ్మీద పత్రికలు వచ్చేసరికి బాగా ఆలస్యం అయ్యేది; కొన్నిచోట్ల మధ్యాహ్నం అయ్యేది. అలాంటిది తెల్లవారే సరికి గుమ్మంలో దినపత్రిక అందించడమనే కొత్త సాంప్రదాయానికి ఈనాడు శ్రీకారం చుట్టింది. ఈనాడు సాధించిన విజయాలకు స్థానిక వార్తలకు అది ఇస్తూ వస్తున్న ప్రాధాన్యత ఒక కారణం.

ప్రముఖ పాత్రికేయుడైన ఎ.బి.కె. ప్రసాద్ ఈనాడుకు ప్రారంభ సంపాదకుడు. 1975 డిసెంబర్ 17హైదరాబాదు లో రెండవ ప్రచురణ కేంద్రం మొదలైంది. అలా విస్తరిస్తూ 2005 అక్టోబర్ 9 నాటికి, రాష్ట్రంలోను, రాష్ట్రం బయటా మొత్తం 23 కేంద్రాలనుండి ప్రచురితమౌతూ, అత్యధిక ప్రచురణ, ఆదరణ కల భారతీయ భాషా పత్రికలలో మూడవ స్థానానికి చేరింది.

... పూర్తి వ్యాసం

Sunday, October 4, 2009

విద్య: ఈ వారం తెవికీ వ్యాసం

విద్య, అనగా బోధన, మరియు నిర్ధిష్ట నైపుణ్యాల అభ్యసనల సమీకరణము. ఇంకనూ విశాలమైన భావంలో, పరిజ్ఞానాన్ని, ధనాత్మక తీర్పును, జ్ఞానాన్ని ఇవ్వడం. విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం, సంస్కృతిని వారసత్వాలకు అందిస్తూ సామాజకీయం జేయడం. విద్య అనగా, వెలికి తీయడం. ప్రకృతి ప్రతి మానవునికీ అంతర్-జ్ఞానాన్ని ప్రసాదించి వుంటుంది. దానిని వెలికి తీయడమే విద్య పని. విద్యారంగాలనేకం. మానసిక శాస్త్రం, తత్వ శాస్త్రం, కంప్యూటర్ శాస్త్రం, భాషాశాస్త్రం, సామాజిక శాస్త్రం మొదలగునవి.


విద్యావిధానాలు, విద్య మరియు శిక్షణ లను ఇవ్వడానికి స్థాపించబడ్డాయి. ఇవి ప్రధానంగా పిల్లలు మరియు యువకుల కొరకు స్థాపించబడ్డాయి. పిల్లలకు యువకులకు, బోధనాంశాలను నిర్ధారించి, వారి విద్యాఫలితాలను, వారి జీవిత లక్ష్యాల కొరకు ప్రతిపాదింపబడుతాయి. వీటి వలన పిల్లలు, ఏమి నేర్చుకోవాలి?, ఎలా నేర్చుకోవాలి?, ఎందుకు నేర్చుకోవాలి? అనే ప్రశ్నలు సంధించుకొనేలా జాగ్రత్తలు తీసుకొని, వారికి విద్యా బోధన ఇవ్వబడుతుంది. బోధనా వృత్తి, ఇందుకు సర్వదా సహాయపడుతూ, పిల్లలలోని అన్ని రంగాల అభివృద్ధికొరకు సహాయపడుతూ, వారికి మంచి పౌరులుగా తీర్చి దిద్దడానికి ఎల్లవేళలా సిద్ధంగా వుంటుంది. ఈ బోధనా వృత్తి, విద్యా బోధన, బోధనాంశాలు, మూల్యాంకనము మొదలగు అంశాలపై ఆధారపడి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది.

... పూర్తి వ్యాసం