వారం వారం తెవికీ వ్యాసాలు.

Sunday, June 28, 2009

చైనా మహా కుడ్యము: ఈ వారం తెవికీ వ్యాసం

ప్రాచీన, మధ్యయుగపు మరియు నేటి ఏడు ప్రపంచవింతలలో ఒకటిగా పరిగణింపబడుతూ, చూపరులకు ఆశ్చర్యచకితులను చేసే చైనా లో గల అతి పొడవైన కుడ్య నిర్మాణమే ఈ చైనా మహా కుడ్యము. దీని పొడవు 6,508 కి.మీ. లేదా 4,000 మైళ్ళు. నిజానికి ఇదో గోడల సమూహము. క్రీ.పూ. 5, 6 శతాబ్దాల కాలంలో ప్రారంభించబడి, క్రీ.శ. 16 శతాబ్దం వరకూ పునర్నిర్మాణాలకు లోనై, నేటికీ నిలిచి ఉంది. దీనిలోని ప్రసిద్ధమైన గోడ చైనా చక్రవర్తి "క్విన్ షీ హువాంగ్" చే క్రీ.పూ. 220 - 200 కాలంలో నిర్మింపబడింది. దీని నిర్మాణానికి కారణం చైనా ఉత్తర సరిహద్దుల నుంచి దండయాత్రలను అరికట్టుట. ఆధునిక కాలంలో కనిపించే గోడ 'మింగ్ వంశ' కాలంలో నిర్మింపబడింది.

క్రీ.పూ. 7వ శతాబ్దకాలంలో చైనీయులకు ఈ కుడ్యనిర్మాణ సాంకేతికాలన్నీ తెలుసు. చైనాలో అంతర్-రాజ్య యుద్ధకాలమైన క్రీ.పూ.5వ శతాబ్దం నుండి క్రీ.పూ. 221 వరకు, "క్వి", "యాన్", మరియు "ఝావో" రాజ్యాలమధ్య, వారి వారి సరిహద్దులను కాపాడుకోవడానికి కోటలకు గోడవలె పటిష్ఠ శత్రు దుర్భేద్య కుడ్యాలను నిర్మించారు

ఈ కుడ్యానికి చెందిన బీజింగ్ ఉత్తర ప్రాంతం, మరమ్మత్తులు పునర్నిర్మాణాలకు నోచుకొని, పర్యాటకుల కేంద్రంగా విరాజిల్లుచున్నది. దీని ఇతర ప్రాంతాలు కుడ్యశిథిలాలతో, గ్రామ ఆటస్థలములుగానూ వీటి ఇటుకలు రాళ్ళు పల్లెవాసుల ఇండ్ల కట్టడాలకు దురుపయోగమౌతున్నవి. ఈ కుడ్యపు అనేక భాగాలునూ దురుపయోగం పాలౌతున్నవి. వీటి గూర్చి సరైన చర్యలు తీసుకోవడం లేదు. మరీ ముఖ్యంగా లోపలి ప్రాంతాలలో దీనిపై సరైన నిఘాలేదు.

రాబోవు 20 సంవత్సరాలలో 'గాన్సూ' రాష్ట్రంలోని ఈ కుడ్యభాగం 60 కి.మీ. కంటే ఎక్కువ భాగం అంతరించిపోయే ప్రమాదముంది. దీనికి కారణాలు దుమ్ము తుఫానులు మరియు ఇసుక తుఫానులు. ఈ ప్రాంతాలలో దీని ఎత్తు 5 మీటర్ల నుండి 2 మీటర్లకు కుదించుకుపోయింది.

... పూర్తివ్యాసం

Sunday, June 21, 2009

కేరళ: ఈ వారం తెవికీ వ్యాసం

కేరళ భారత దేశంలో నైరుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రము. క్రీ.పూ.10 వ శతాబ్దంలో ద్రావిడ భాషలు మాట్లాడే వారు ఇక్కడ స్థిరపడ్డారు. మౌర్య సామ్రాజ్యం లో భాగంగా ఉండేది. తరువాతి కాలంలో చేర సామ్రాజ్యంలోను, భూస్వామ్య నంబూదిరిల పాలనలోను ఉంటూ వచ్చింది. విదేశాలతో ఏర్పరచుకుంటున్న సంబంధాలు చివరకు స్థానికులకు, ఆక్రమణదారులకు మధ్య ఘర్షణలకు దారితీసాయి. మూడో ప్రపంచ దేశాల్లోనే అత్యధిక అక్షరాస్యత ఉన్న, అత్యంత ఆరోగ్యకరమైన ప్రాంతంగా కేరళ నిలిచింది.

14 వ శతాబ్దపు తొలినాళ్ళకు, భాష పరంగా కేరళ ప్రత్యేకతను సంతరించుకుంది. ఆధారాలు లభించిన మొదటి సామ్రాజ్యం - చేర వంశీకులు - వంచి రాజధానిగా కేరళను పాలించారు. పల్లవుల తో కలిసి వారు చోళ, పాండ్య రాజులతో యుద్ధాలు చేసారు. 8- 14 శతాబ్దాల మధ్యకాలంలో చేరరాజుల పాలనా సమయంలో మళయాళం భాష అభివృద్ధి చెందింది. ఆదే సమయంలో కేరళీయులు తమిళప్రజలలో భాగంగా కాక ఒక ప్రత్యేకమైన జాతిగా గుర్తింపు ఏర్పడింది. లిఖితంగా కేరళ గురించిన ప్రస్తావన సంస్కృత ఇతిహాసం ఐతరేయారణ్యకంలో మొదటిగా లభిస్తున్నది. తరువాత కాత్యాయనుడు, పతంజలి, పెద్దప్లినీల వ్రాతలలోనూ, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ గ్రంధంలోనూ కేరళ ప్రస్తావనలున్నాయి.

1947లో భారతదేశం స్వతంత్రమైనాక 1941 జూలై 1న తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థానాలను కలిపి తిరువాన్కూర్-కొచ్చిన్ ఏర్పరచారు. 1950 జనవరి 1న దీనిని ఒక రాష్ట్రంగా గుర్తించారు. ఇదే సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీని మద్రాసు రాష్ట్రం చేశారు. 1956 నవంబరు 1న, రాష్ట్రపునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేరళ రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు ప్రెసిడెన్సీనుండి మలబార్‌ప్రాంతాన్ని (4 తాలూకాలు మినహా) వేరుచేసి తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్రంలో కలిపారు. 1957లో క్రొత్త అసెంబ్లీ ఎన్నిల అనంతరం ఇ.ఎమ్.ఎస్.నంబూద్రిపాద్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికలద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడం అనేది ప్రపంచంలోనే మొదటి వాటిలో ఇది ఒకటి.

కేరళ జంతుసంపదలో వైవిధ్యం, స్థానికత్వం గమనించదగిన విషయాలు. తీవ్రమైన పర్యావరణ వినాశనం (అడవల నరికివేత, చరియలు విరగడం, ఉప్పుపట్టడం, ఖనిజసంపద త్రవ్వకం వంటివి) వల్ల కేరళలోని ఈ జంతుసంపద మనుగడకు ప్రమాదం వాటిల్లుతున్నది.

... పూర్తి వ్యాసం

Monday, June 15, 2009

కందుకూరి వీరేశలింగం పంతులు: ఈ వారం తెవికీ వ్యాసం

కందుకూరి వీరేశలింగం పంతులు సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు. సాహితీ వ్యాసంగంలోనూ అంతటి కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. ఆయన జీవితం సంఘసంస్కరణ, సాహిత్య కృషిలతో పెనవేసుకు పోయింది. ప్రభుత్వంలోని అవినీతిని ఏవగించుకుని ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని, అబద్ధాలు ఆడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్న వ్యక్తి.

బాల్య వివాహాల వ్యతిరేకంగా, కుల నిర్మూలనకు అకుంఠిత దీక్షతో పనిచేసాడు. ఆయన చేసిన ఇతర సంస్కరణా కార్యక్రమాలొక ఎత్తు, వితంతు పునర్వివాహాలొక ఎత్తు. 1881 డిసెంబరు 11న తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం చేశారు. సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించాడు. పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, మరియు ఆయన విద్యార్ధులు వీరేశలింగానికి అండగా నిలిచారు. ఆయన భార్య రాజ్యలక్ష్మమ్మ భర్తకు బాసటగా ఉంది. వంటవాళ్ళు, నీళ్ళవాళ్ళు వారి ఇంటికి రావడానికి నిరాకరించినపుడు రాజ్యలక్ష్మమ్మ స్వయంగా గోదావరికి వెళ్ళి నీళ్ళు తెచ్చి పెళ్ళివారికి వంట చేసిపెట్టింది.

వీరేశలింగం సాహిత్యంలోనూ అంతే కృషి జరిపాడు. చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. వివేకవర్ధనిలో సులభశైలిలో రచనలు చేసేవాడు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకరు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ కలవాడు. 130కి పైగా గ్రంధాలు రాసాడు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంధాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు రాసాడు. స్వీయ చరిత్ర రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు. సంగ్రహ వ్యాకరణం రాసాడు. నీతిచంద్రిక లోని సంధి, విగ్రహం భాగాలను చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం పూర్తి చేసాడు.

... పూర్తి వ్యాసం

Sunday, June 7, 2009

ఫుట్‌బాల్: ఈ వారం తెవికీ వ్యాసం

ఫుట్‌బాల్, ఒక జట్టు క్రీడ. దీని అసలు పేరు అసోషియేషన్ ఫుట్‌బాల్. ఇందులో జట్టుకు 11 మంది ఆటగాళ్లు ఉంటారు. ప్రపంచంలో అతి విరివిగా అడబడే ఆట ఇది దీర్ఘచతురస్రాకార మైదానాలలో ఈ ఆట ఆడుతారు. మైదానానికి ఇరు చివర్ల లక్ష్యాలుంటాయి (గోల్ పోస్టులు). బంతిని లక్ష్యానికి చేర్చి స్కోరు చెయ్యడం ఆట ప్రధాన లక్ష్యం. బంతిని చేతితో తాకు హక్కు గోలుకీపరుకు మాత్రమే వుంటుంది. మిగిలిన ఆటగాళ్ళందరూ, బంతిని కాలితో తన్నడం, తలతో కొట్టడం, లేక ఛాతీతో నియంత్రించడం చేస్తుంటారు. నియంత్రిత సమయం లో ఎక్కువ సార్లు లక్ష్యాన్ని ఛేధించిన జట్టు విజేత. ఇరు జట్లు సమాన సంఖ్యలో గోలులు చేస్తే పోటీ బట్టి ఆట డ్రాగా పరిగణించబడడం, లేక అధిక సమయంలోకి తీసుకు వెళ్ళడం జరుగుతుంది.

అత్యున్నత స్థాయిలో జరుగు ఆటలలో సగటున రెండు మాడు గోలులు మాత్రమే చేయబడతాయి. ఆట నియమాల ప్రకారం ఆటగాళ్ళందరి స్థానాలు నియంత్రించబడి లేవు. గోలి తప్పు మిగిలిన ఆటగాళ్ళు మైదానంలో యదేఛ్చగా తిరగవచ్చు. కాని కాల గమనంతో ఫుట్‌బాలులో చాలా స్థితులు రూపుదిద్దుకున్నాయి. ఇందులో ముఖ్యంగా మూడు రకాల స్థితులున్నాయి: స్ట్రైకర్లు, ముందు వరుస వారు, (గోలులు చేయడం వీరి ప్రత్యేకత); రక్షకులు (వీరు ప్రత్యర్ధులు గోలు చేయకుండా చూడాలి); మరియు మైదాన మధ్యులు, బంతిని తమ జట్టు అధీనంలో వుంచడం, దానిని గోలు చేయవలసిన ముందువరుస వారికి అందించడం వీరి కర్తవ్యం. వీరిని గోలీ నుండి గుర్తించడానికి మైదానఆటవారు (అవుట్ ఫీల్డర్స్) గా సంబోధిస్తారు. ఆడువారు ఆడు చోటు ప్రకారం, ఈ స్థితులని ఇంకా విభజించి సంబోధించడం జరుగుతుంది. ఉదా- ఎడమ రక్షకులు, కుడి రక్షకులు వగైరా. పది మంది మైదాన ఆటవారిని ఏ విధానంగా నైనా అమర్చడం జరుగుతుంది. ప్రతి వరుసలో ఎంత మంది ఆటవారు వున్నదీ, జట్టు ఆడు తీరును రూపు దిద్దుతుంది. ఎక్కువ మంది ముందువరుస వారు, తక్కువ రక్షకులు వున్నప్పుడు, గోలు చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నట్టు ఆడుతున్నవారు.


ఆధికారిక ఆట నియమాలు పదిహేడు వున్నవి. ఇవే ఆట యొక్క అన్ని స్థాయిల్లోనూ వర్తిస్తాయి. పిల్లలు మహిళలకోసం వీటిని అప్పుడప్పుడూ స్వల్పంగా మార్చడం జరుగుతుంది. ఈ పదిహేడు నియమాలతో బాటు అనేక IFAB నిర్దేశాలు ఆటని నియంత్రిస్తాయి. ఆట నియమాలను ఫీఫా ప్రచురించినప్పటికీ అవి IFAB పర్యవేక్షణలోనే వున్నాయి.

... పూర్తి వ్యాసం